తెలంగాణా రాష్ట్రం నుంచి విద్యాశాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల బృందం జర్మనీ పర్యటనకు వెళ్లనుంది. ఏప్రిల్లో అధికారులు, టీచర్లు, అధ్యాపకులు ఫిన్లాండ్లో పర్యటించి.. అక్కడి పాఠశాలలను పరిశీలించి వచ్చిన విషయం తెలిసిందే. ఈసారి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, మరికొంత మంది అధికారులతో పాటు ఓయూ, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఆచార్యులు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు మొత్తం 35 మంది ఈ నెల 28న జర్మనీ వెళ్లనున్నారు. కాగా, మరో మూడు రోజుల్లో బృందం పర్యటనకు బయలుదేరుతున్నా.. ఇప్పటివరకు విద్యాశాఖ కనీసం పర్యటన లక్ష్యం ఏమిటి? ఎన్ని రోజుల పర్యటన? అక్కడ ఏ వర్సిటీలను సందర్శిస్తారు తదితర వివరాలను వెల్లడించకపోవడం గమనార్హం.
